India-Maldives: ‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు

India-Maldives: భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Published : 07 May 2024 11:00 IST

India-Maldives | మాలె: ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను (Maldives) సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తుచేశారు.

‘‘మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను’’ అని పీటీఐ వీడియోస్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైసల్‌ అన్నారు.

ప్రధాని మోదీ (PM Modi) భారత్‌లో అంతర్భాగమైన లక్షద్వీప్‌ దీవులను జనవరిలో సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి పర్యటక అద్భుతాలను హైలైట్‌ చేస్తూ ఫొటోలు, వీడియోలు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీనిపై అనవసరంగా జోక్యం చేసుకున్న మాల్దీవుల (Maldives) మంత్రులు.. భారత్‌ సహా ప్రధానిపై నోరుపారేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. మరోవైపు చైనా అనుకూలుడైన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించటంతో సంబంధాలు మరింత క్షీణించాయి.

ఈ పరిణామాల మధ్య మాల్దీవులకు వెళ్లడానికి సిద్ధమైన ప్రముఖులు సహా అనేక మంది భారతీయులు తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. విమాన, హోటల్‌ బుకింగ్‌లను క్యాన్సిల్‌ చేశారు. కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్‌లను నిలిపివేశాయి. దీంతో అప్పటి వరకు మాల్దీవులను సందర్శిస్తున్న పర్యటకుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. 2024 తొలి నాలుగు నెలల్లో భారత పర్యటకుల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయింది.

పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని